telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

ముక్కల పచ్చడి

కావలసిన వస్తువులు:

మామిడికాయలు - మీడియం సైజువి 25. (పది కాయలు చెక్కు తీసి, మిగిలిన కాయలు చెక్కుతో సన్నగా పొడుగ్గా కోయాలి).
కారం - 1 కిలో.
ఉప్పు - 1 కిలో.
పసుపు - ఒక చెంచా.
నూనె - 1 కిలో.
నువ్వులనూనె - పావు కిలో(పోపులోకి).
మెంతులు - పావు కిలో (వేయించి పొడిచేయాలి).
జీలకర్ర పొడి - ఒక స్పూను (వేయించి పొడి చేయాలి).
ఆవపిండి - ఒక స్పూను (పచ్చిది).
పోపులోకి - ఒక్కొక్క చెంచా చొప్పున జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇంగువ వేసి పోపు వేయాలి.

తయారు చేసే విధానం:

మామిడికాయల్ని శుభ్రంగా కడిగి, తుడిచి ఆరబెట్టి సన్నగా తరిగి ఉంచుకోవాలి. ముక్కలతో పైన చెప్పిన పొడులన్నీ కలుపుకొని నూనె చేర్చి ఈ మిశ్రమంలో చివరగా పోపు కలపాలి. పచ్చడి పెట్టిన మూడో రోజున బాగా కలిపి, ఉప్పు సరి చూసుకోవాలి.


[ వెనుకకు ]


కొబ్బరి పాయసం

కావలసిన వస్తువులు:

కొబ్బరికాయ - ఒకటి.
బియ్యం - ఒక కప్పు.
పంచదార లేదా బెల్లం తురుము - రెండు కప్పులు.
యాలకులు - పది.
జీడిపప్పు - పది.
కిస్‌మిస్ - పది.
నెయ్యి - రెండు స్పూన్లు.

తయారు చేసే విధానం:

బియ్యం కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి. తరవాత కొబ్బరితో కలిపి మెత్తగా పలుచగా దోసెల పిండిలా రుబ్బాలి. మందపాటి గిన్నెలో బెల్లం తురుము, ఓ గ్లాసు నీళ్లు పోసి స్టవ్‌మీద పెట్టాలి. బెల్లం కరిగి మరుగుతున్నప్పుడు రుబ్బి ఉంచిన పిండి ఉడికేవరకూ కలుపుతూనే ఉండాలి. (పాకం బాగా చిక్కబడితే పిండి ఉడికినట్లే). తరవాత దీన్ని కిందకు దించి యాలకుల పొడి, నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ వెయ్యాలి. దీన్ని వేడిగా కన్నా చల్లగ తింటే రుచిగా ఉంటుంది.


[ వెనుకకు ]


కాయిన్ చిప్స్

కావలసిన వస్తువులు:

మైదా - ముప్పావు కిలో.
బియ్యపిండి - పావు కిలో.
నూనె - తగినంత.
వేడినీళ్లు - తగినన్ని.
వాము - 2 టేబుల్ స్పూన్లు.
కరిగించిన డాల్డా - 1 కప్పు.
ఉప్పు - తగినంత.
బేకింగ్‌పౌడర్ - అర టీ స్పూను.
మిరియాలపొడి - అర టీ స్పూను.
పంచదార - 2 టీ స్పూన్లు.
కారం - కొంచెం.

తయారు చేసే విధానం:

మైదాలో బియ్యప్పిండి, పంచదార పొడి, ఉప్పు, పసుపు, బేకింగ్‌పౌడర్ వేసి జల్లించి కలపాలి. అందులో మిరియాల పొడి, వాము వేసి కరిగించిన డాల్డా, తగినన్ని నీళ్లు పోసి చపాతీపిండిలా ముద్దలా చేసి గాలి చొరకుండా గంట ఉంచాలి. పిండిముద్దని కాస్త పెద్ద పెద్ద ముద్దలుగా చేసుకుని మందపాటి పూరీలుగా వత్తి రూపాయి కాసంత సైజు మూతతో బిళ్లలుగా కత్తిరించి వేయించాలి. కరకరలాడుతూ రుచిగా ఉండే ఈ మైదా చిప్స్‌ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.


[ వెనుకకు ]


కొబ్బరి అట్టు

కావలసిన వస్తువులు:

కొబ్బరికాయ - ఒకటి.
బియ్యం - రెండు కప్పులు.
ఉప్పు - తగినంత.
జీలకర్ర - ఒక స్పూను.
పచ్చిమిరపకాయలు - 6.
నూనె - అర కప్పు.

తయారు చేసే విధానం:

ముందుగా బియ్యం కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి. తరవాత నీళ్లు వంచేసి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, వేసి మెత్తగా దోసెల పిండిలా గ్రైండ్ చేయాలి. తరవాత పెనం మీద నూనె వేసి ఓ గరిటెడు పిండి వేసి పలుచగా దోసెలు పోసి రెండువైపులా కాల్చాలి. వీటిని వేడివేడిగా కారప్పొడితో తింటే బాగుంటాయి.


[ వెనుకకు ]


చాంద్ బిస్కట్స్

కావలసిన వస్తువులు:

మైదా - 500 గ్రా.
పంచదార పొడి - పావు కిలో.
యాలకులు - 3 గ్రా.
వనస్పతి - పావు కిలో.

తయారు చేసే విధానం:

మైదాను జల్లించండి. మధ్యలో గొయ్యిలా చేసి, వనస్పతి వేసి బాగా తెల్లగా అయ్యే వరకూ ఉంచండి. పిదప పంచదార పొడి చేర్చండి. ఇందులోకి కొద్దికొద్దిగా మైదాను చేర్చుతూ ముద్దలా చేయండి. మైదా అంతా కలిసిన తరవాత బాగా కలిపి మర్దన చేసి పిండి ముద్దలా చేస్తే మెత్తగా తయారవుతుంది. ఆపైన యాలకుల పొడి కలపండి.

ఈ ముద్దను పీట మీద ఉంచి మందంగా ఉన్న చపాతీలా చేయండి. పదునుగా ఉన్న గ్లాసు అంచుతో అద్దుతూ పోతే అర్థచంద్రాకారంలోని బిస్కట్లు రూపొందుతాయి. వీటిని ఓ ట్రేలో అమర్చి 180 డిగ్రీల సెల్సియస్ దగ్గర 20 నిమిషాలపాటు బేక్ చేయండి. చాంద్ బిస్కట్స్ రెడీ! చల్లారిన తరవాత ఆరగించండి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: