telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

వంటలు (కొన్ని)

ఉగాది పచ్చడి

కావలసిన వస్తువులు:

మామిడి కాయ - ఒకటి (చిన్నది).
వేప పూత - కొంచెం.
సన్నవి కొబ్బరి ముక్కలు - కొన్ని.
చింతపండు - 100గ్రా.
బెల్లం - 100గ్రా.

తయారు చేసే విధానం:

ముందుగా చింతపండుని 1 గంట సేపు నానబెట్టి ఈనెలు రాకుండా పేస్టు తీసుకోవాలి. తరువాత వేప పూతని శుభ్రంగా పుల్లలు లేకుండా తీసుకోవాలి. మామిడి కాయని చిన్న ముక్కలుగా తరగాలి. అలాగే కొబ్బరిముక్కలను సన్నగా తరగాలి. బెల్లం బాగా గుజ్జు లాగా చేయాలి. ఇప్పుడు చింతపండు పేస్టులో బెల్లం గుజ్జుని కలుపుతూ తరిగిన మామిడి ముక్కలను, కొబ్బరి ముక్కలను, వేపపూతని అన్నీ బాగా కలిసేటట్టుగా కలపాలి. అంతే పులుపు, తీపి, చేదు కలిసిన మిశ్రమం ఉగాది పచ్చడి తయారయిపోయింది.

ఉగాది పచ్చడి సేవనం తెలియజెప్పే నిజం. "కష్ట సుఖాలు జీవితంలో చవిచూడాలి".


[ వెనుకకు ]

క్రీమ్ అప్ సూప్

కావలసిన వస్తువులు:

ఎర్రని టమోటాలు (బెంగుళూరు వెరైటీ) - అరకిలో.
క్యారెట్ - పావుకిలో.
ఉల్లిపాయలు - కొన్ని.
పలావు ఆకులు - 3.
మిరియాలు - 2 టీ స్పూన్లు.
వెల్లుల్లి - 4 రెబ్బలు.
వెన్న లేదా డాల్డా - 50గ్రా
బ్రెడ్ ముక్కలు - ఒక కప్పు.
మైదాపిండి - 50గ్రా.
పాలు - అర లీటరు.
మంచినీళ్లు - ఒక లీటరు.
పంచదార - అర టీ స్పూను.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

బ్రెడ్ ముక్కల్ని వేయించి ఉంచాలి. ఓ గిన్నెలో నీళ్లు పోసి, ముందుగా తరిగిన టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు మరియు క్యారెట్ తురుము వేసి ఉడికించాలి. ముక్కలు కాస్త ఉడికిన తరవాత పలావు ఆకులు, మిరియాలు, వెల్లుల్లి కలిపి 10 నిముషాలు ఉడికించి దించాలి. తరువాత నీళ్లు విడిగా ఓ గిన్నెలోకి వడగట్టి ఉంచాలి. దీన్నే సూప్ పుయారీ అంటారు. కూరగాయ ముక్కల్ని చల్లారనిచ్చి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మరో మందపాటి బాణలిలో డాల్డా లేదా వెన్న వేసి, అది కరిగిన తరవాత మైదా పిండి వేసి దోరగా వేయించాలి. ఇందులో పాలు పోస్తే వైట్ సాస్‌లా తయారవుతుంది. ఇప్పుడు సూప్ పుయారీలో వైట్‌సాస్, కూరగాయ ముక్కల పేస్టు వేసి, బాగా కలపాలి. చిక్కగా అయ్యేవరకూ మరిగించి, తగినంత ఉప్పు వేసి దించాలి. బ్రెడ్ ముక్కల్ని కూడా కలిపి కాస్త మీగడను సూప్ ‌మీద అలంకరించి అందించండి.


[ వెనుకకు ]

బాంబే హల్వా

కావలసిన వస్తువులు:

మైదాపిండి - ఒక కప్పు.
శనగపిండి, చెక్కెర - ఒక కప్పు.
పసుపురంగు ఫుడ్ కలర్ - అర టీ స్పూన్‌.
నెయ్యి - ఒకటిన్నర కప్పులు.
జీడిపప్పులు, బాదం ముక్కలు - రెండు టీ స్పూన్లు.

తయారు చేసే విధానం:

మైదాపిండిని ముందురోజు రాత్రే నీటిలో గట్టిగా కలిపిఉంచాలి. శనగపిండిని సువాసన వచ్చేవరకూ వేయించాలి. అడుగు మందంగా వుండే పాత్రలో చెక్కర వేసి నీరుపోసి తీగపాకం రానివ్వాలి. మైదాపిండి, వేయించిపెట్టుకున్న శనగపిండి అందులో పోసి, కలుపుతూవుండాలి. గట్టిపడ్డాక నెయ్యి, రంగు చేర్చి మరోసారి కలపాలి. జీడిపప్పులు, బాదాములు ఒక పళ్లెంలో పోసి, వాటిమీద హల్వాను పోయాలి. చల్లారాక ముక్కలు చేయాలి.


[ వెనుకకు ]

పానీపూరీ సుండల్

కావలసిన వస్తువులు:

ఉప్పువేసి ఉడికించిన సెనగలు - ఒక కప్పు.
వామువేసి చేసిన కారప్పూస - తగినంత.
సన్నగా తరిగిన కీరాముక్కలు, ఉల్లి ముక్కలు, క్యారెట్ తురుము - తగినంత.
పానీపూరీలు - ఇరవై.
మిరియాల పొడి, అల్లం పేస్ట్ - ఒక టీ స్పూన్‌.
కాస్త సన్నగాతరిగిన కొతీమీర - తగినంత.

తయారు చేసే విధానం:

పానీపూరీలను విరిచి, వాటిమీద పైనచెప్పుకున్న సామాగ్రినంతటిని వేసి, కలపాలి. తయారైన పానీపూరీ సుండల్ తింటేకానీ ఆరుచి తెలియదు.


[ వెనుకకు ]

వెరైటీ పులావ్

కావలసిన వస్తువులు:

బాస్మతిబియ్యం - ఒక కప్పు.
క్యారెట్, మొక్కజొన్న గింజలు - ఒకటిన్నర కప్పులు.
క్యాలీప్లవర్, పచ్చిబఠాణీలు, బీన్స్ ముక్కలు - కొన్ని.
నెయ్యి - రెండు టీ స్పూన్లు.
పసుపు - 1/4 టీ స్పూన్‌.
ఉప్పు, కారం - ఒక టీ స్పూన్‌.
జీలకర్ర - ఒక టీ స్పూన్‌.
మసాలా ఆకులు - రెండు.
లవంగాలు, మిరియాలు - నాలుగు.
నీరు - మూడు కప్పులు..
నిమ్మకాయ - ఒకటి.

తయారు చేసే విధానం:

బియ్యం కడిగి అరగంట సేపు నానబెట్టాలి. నెయ్యి వేడి చేసి జీలకర్ర, మసాలా ఆకులు, లవంగాలు, మిరియాలు వేసి బాగా వేయించాలి. తరువాత కూరగాయల ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి వేయించాలి. నీరుపోసి కలపాలి. ఐదు నిమిషాల తరువాత, బియ్యం కలపాలి. సన్నని మంట మీద నీరు ఇగిరేవరకు ఉడికించాలి. తరువాత నిమ్మరసం చేర్చి వేడివేడిగా వడ్డించాలి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం